అంత్యక్రియలకు డబ్బుల్లేక మూడు రోజులు మృతదేహంతోనే
అంత్యక్రియలకు డబ్బుల్లేక మూడు రోజులు మృతదేహంతోనే కుటుంబం
హైదరాబాద్లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గల షాపూర్నగర్ సమీపంలో ఉన్న ఎన్ఎల్బీనగర్ ప్రాంతంలో ఒక హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది.ఆ క్రమంలో చూస్తే..మహబూబ్నగర్ జిల్లాకు చెందిన 76 ఏళ్ల స్వామిదాస్ అనే వృద్ధుడు మరణించగా అతని అంత్యక్రియలు నిర్వహించడానికి డబ్బులు లేక అతని కుటుంబ సభ్యులు మూడు రోజుల పాటు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకున్నారు.
స్వామిదాస్ చిన్న కూతురు సలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించేది.అయితే తన తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో అతడిని చూసుకోవడానికి ఉద్యోగం మానేసింది.ఆ నేపథ్యంలోనే స్వామిదాస్ ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించాడు.దాంతో అంత్యక్రియలు జరిపించడానికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో కుటుంబ సభ్యులు నిస్సహాయ స్థితిలో ఏమి చేయలేక మూడు రోజులుగా ఆ మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకుని జీవించారు.
గత మూడు రోజులుగా ఆ కుటుంబ సభ్యులు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆ ఇంటి యాజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ విషయం తెలుసుకోని చలించిపోయారు.వెంటనే మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.అనంతరం ఒక స్వచ్ఛంద సంస్థ సహాయంతో స్వామిదాస్ అంత్యక్రియలు గౌరవప్రదంగా నిర్వహించారు.ఈ ఘటన సమాజంలో ఆర్థిక అసమానతలు,నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి సహాయం చేయాల్సిన ఆవశ్యకతను మరోసారి గుర్తు చేసింది.ప్రధానంగా పోలీసులు ఇంకా స్వచ్ఛంద సంస్థ చూపిన సాటి గొప్ప మానవత్వం పలువురి ప్రశంసలు అందుకుంది.

Comments
Post a Comment